“షూలేస్‌” సరిగా కట్టుకోలేని వాళ్లకి “ధోని రిటైర్మెంట్” గురించి ఎందుకు?

0
167

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌‌పై చర్చ మళ్లీ తెరపైకి రావడంతో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి ప్రారంభంకానున్న టీ20, టెస్టు సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు గురువారం జట్టుని ప్రకటించగా.. ధోనీ ఈ సెలక్షన్‌కి దూరంగా ఉన్నాడు. దీంతో.. ధోనీ ఇక రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని కొందరు.. అతనికి సెలక్టర్లు ఇకపై అవకాశం ఇవ్వబోరని మరికొందరు మీడియాతో అభిప్రాయపడ్డారు. టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా.. రిటైర్మెంట్‌ అనేది అతని వ్యక్తిగత నిర్ణయమని చెప్తూనే దేశవాళీ క్రికెట్‌లో ఆడి మళ్లీ లయ అందుకుంటే సెలక్షన్‌కి పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించాడు. ప్రస్తుతానికి అయితే ధోనీని పక్కనపెట్టి యువ క్రికెటర్లకి అవకాశాలివ్వడంపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చాడు.

ధోనీ రిటైర్మెంట్ వార్తలపై రవిశాస్త్రి మాట్లాడుతూ ‘కనీసం షూలేస్‌ని సరిగా కట్టుకోలేని వాళ్లు కూడా ధోనీ రిటైర్మెంట్‌ గురించి మాట్లాడుతున్నారు. టీమిండియాకి ధోనీ అందించిన సేవలు ఒకసారి చూడండి. అయినా.. ఎందుకు ధోనీ రిటైర్మెంట్‌పై కొందరు తొందరపడుతున్నారు..? బహుశా వారికి మాట్లాడటానికి ఏ విషయాలు దొరకడం లేదేమో..! ఇలా చౌకబారు వ్యాఖ్యలతో ధోనీని అవమానించకండి. 15 ఏళ్ల నుంచి టీమిండియాకి ఆడుతున్న ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో ఆ మాత్రం తెలియదా..?’ అని మండిపడ్డాడు.

బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో పాటు వెస్టిండీస్‌తో డిసెంబరులో జరగునున్న సిరీస్‌కి కూడా ధోనీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే సిరీస్‌ సమయానికి దేశవాళీ క్రికెట్‌లో ధోనీ ఆడి ఫామ్ నిరూపించుకుంటే మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది.