రోహిత్ తొందరేమిలేదు…గొడవలకి ముగింపు పలికిన కోహ్లి..!

0
161

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని వరల్డ్‌కప్‌ ముగిసినప్పటి నుంచి వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ వార్తలపై విరాట్ కోహ్లీ స్పందించినా.. రోహిత్ శర్మ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకి ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో కనీసం తుది జట్టు(టెస్టు సిరీస్‌)లో అవకాశం దక్కలేదు. రోహిత్ శర్మ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ రిజర్వ్ బెంచ్‌పై అలా కూర్చోవడం తనని బాధించిందని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో.. రోహిత్‌తో విభేదాల కారణంగానే అతడ్ని టెస్టుల్లో పక్కన పెట్టినట్లు కెప్టెన్ కోహ్లీపై ఆరోపణలు వచ్చాయి.

దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడు టెస్టు సిరీస్‌ కోసం ఓపెనర్‌గా రోహిత్ శర్మని సెలక్టర్లు ఎంపిక చేయగా.. తుది జట్టులోనూ అతను ఆడటం ఖాయమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కీలక సిరీస్‌‌‌కి ముందు రోహిత్ శర్మకి మద్దతుగా మాట్లాడి గొడవ వార్తలకి ముగింపు పలికాడు. వన్డే, టీ20ల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం ఇన్నాళ్లు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. కానీ.. బుధవారం నుంచి విశాఖపట్నం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు.

రోహిత్ శర్మ గురించి మంగళవారం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ‘ఓపెనర్‌గా రోహిత్ శర్మ విషయంలో టీమిండియాకి ఇప్పుడేమీ తొందర్లేదు. టెస్టుల్లో అతను లయ అందుకోవడానికి తగినంత వ్యవధి ఇస్తాం. సిరీస్‌లో అతను తనకి నచ్చినట్లు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు’ అని భరోసా ఇచ్చాడు. దీంతో.. రోహిత్ శర్మపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ సిరీస్‌లో ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోదనే విషయం కెప్టెన్‌ మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ డకౌటైన విషయం తెలిసిందే.