కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో గ్రామ, వార్డు వలంటీర్లు ముందుండి నడిపిస్తున్నారు. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు. ఇంటింటా సర్వే చేసి విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వేలాది మందిని గుర్తించారు. వారిని పరిశీలించిన వైద్య సిబ్బంది 29,494 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. 178 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పర్యవేక్షిస్తూ ఆరోగ్య స్థితిగతులను వలంటీర్లు ఎప్పటికప్పుడు వైద్యులకు తెలియచేస్తున్నారు.
తాత మరణించినా విధుల్లోనే..
ఇతని పేరు మొలతాటి గిరీష్. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు రూరల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. ముత్తుకూరులో ఉంటున్న గిరీష్ వాళ్ల తాత శ్రీరామచెన్నయ్య గత వారం అనార్యోగంతో మరణించాడు. కరోనా నేపథ్యంలో సెలవు పెట్టలేకపోయాడు. అంత్యక్రియలకు కూడా ఆఖరి నిమిషంలో వెళ్లి వచ్చాడు. అలాగే తల్లి శశికళకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేకున్నా కూడా.. విధులకు హాజరై ప్రజలకు సేవ చేస్తున్నాడు.
పారిశుధ్య పనుల్లో కార్మికులు
పట్టణాలు, గ్రామాల్లో వీధులు, మురుగునీటి కాలువలను పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. కరోనా పాజిటివ్గా తేలిన వారి ఇళ్ల పరిసరాలను జల్లెడ పట్టి వైరస్పై సమరం చేస్తున్నారు.
విరామం ఎరుగని వైద్య సిబ్బంది..
కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చిన రోగులకు వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారు. రోగుల రక్తాన్ని పరీక్షల కోసం పంపి పాజిటివ్గా తేలినవారిని 24 గంటలూ కనిపెట్టుకుని చికిత్స అందిస్తున్నారు. హోం క్వారంటైన్, హాస్పిటల్ క్వారంటైన్లో ఉన్న వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆరా తీసి వైద్యం అందిస్తున్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా
‘వైద్యులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విధులు నిర్వహించాల్సిందే. అర్ధరాత్రి వేళల్లో కేసు వచ్చినా అటెండ్ అవుతున్నాం. నా భార్య కూడా డాక్టరే. నెల రోజులుగా నిద్రకూడా సరిగా లేకుండా పనిచేస్తున్నాం. ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కృష్ణాజిల్లాకు చెందిన నలుగురు, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు పాజిటివ్ రోగులు ఇక్కడ చికిత్సపొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించి వ్యాధిని నయం చేయడమే మా లక్ష్యం’
– డాక్టర్ గోపీచంద్, పల్మనాలజిస్ట్, నోడల్ ఆఫీసర్, కోవిడ్ 19 ట్రీట్మెంట్ సెంటర్, విజయవాడ
ధైర్యంగా ముందుకెళుతోంది..
‘మా అమ్మ ఏఎన్ఎంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విధులు నిర్వహిస్తోంది. అమ్మ పరిధిలో నాలుగు వార్డులు ఉన్నాయి. కరోనా వైరస్ ప్రాణాలకే ముప్పు అని తెలిసినప్పటికీ మా అమ్మ ధైర్యంగా ఇంటింటికీ వెళుతోంది. ప్రజల ప్రాణాలు కాపాడినప్పుడు తృప్తి ఉంటుందని అమ్మ చెబుతుంటుంది’
– వి ఆదిత్యగౌడ్, పిడుగురాళ్ల
అంతా సహకరిస్తేనే
‘‘నా పేరు స్వర్ణ. కడప అక్కాయపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నర్స్ (ఏఎన్ఎం)గా పనిచేస్తున్నా. కరోనా వైరస్ వైద్య సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హోం క్వారంటైన్లో ఉన్న వారిని నేను 14 రోజుల పాటు పర్యవేక్షించాలి. మాకు కుటుంబం కంటే కరోనా వైరస్ను అంతమొందించడమే ముఖ్యం. అందుకోసం ఎన్ని రోజులైనా సరే, విశ్రాంతి లేకపోయినా పర్వాలేదు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించినప్పుడే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయగలం’’
– స్వర్ణ, నర్స్, పీహెచ్సీ అక్కాయపల్లె, కడప
నిరంతర పర్యవేక్షణతో కట్టడి
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రూరల్ ఎస్సై కె.లక్ష్మి కరోనాపై అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతానికి విదేశాల నుంచి వచ్చిన 104 మంది ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. ఎస్ఐ రోజూ వీరందరినీ కలుస్తూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఆమెకు ఇద్దరు చిన్నారులు ఉన్నప్పటికీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రజల్ని కాపాడాలన్న కృత నిశ్చయంతో 21 పంచాయతీల్లో రోజూ పర్యటిస్తున్నారు.
వీరబాబు అలుపెరుగని సేవ
కాకినాడ రూరల్లోని ఓ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్గా పని చేసే యేలేటి వీరబాబుకు భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. రోజుకు 15 నుంచి 20 వరకు సిలిండర్లు అందచేస్తాడు. భార్య, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని కోరుతున్నా తనకోసం ఎదురుచూసే వందల మంది వినియోగదారుల కోసం ఇంటింటికీ వెళ్లక తప్పడం లేదని పేర్కొంటున్నాడు.
గర్వంగా ఉంది..
‘‘నా భర్త అల్లు రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళితే రాత్రి 11 గంటలకు తిరిగి వస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైరస్పై ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా నా భర్త ప్రజలకు సేవ చేస్తుండటం ఎంతో గర్వంగా ఉంది’’
– అల్లు శోభ, పిడుగురాళ్ల
వచ్చే వరకూ భయమే
‘మా కోడలు ధనలక్ష్మి 24వ వార్డు వలంటీరుగా పనిచేస్తోంది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి ఆరోగ్య వివరాలు సేకరించే పని అప్పగించడంతో ఎంతో మంది ఆమెను నిరుత్సాహపరిచారు. అయితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఆమెకి వచ్చినందుకు గర్వపడుతున్నాం’
– కల్యాణి, వెంకటరెడ్డి, 24వ వార్డు వలంటీర్ ధనలక్ష్మి అత్త,మామలు
అవగాహన కల్పిస్తున్నాం
‘ప్రజలను రక్షించేందుకు వలంటీర్లతో కలిసి శ్రమిస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నాం. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పిస్తున్నాం’’
– శ్రీలక్ష్మి , మహిళా సంరక్షణ కార్యదర్శి, గూళ్యం గ్రామ సచివాలయం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా




























