“వరల్డ్ కప్ టైంకి వచ్చేస్తాడంట ధోని”!

0
180

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వచ్చే ఏడాది జనవరిలో టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న ధోనీ.. రిటైర్మెంట్‌పై మౌనం వహిస్తున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌కి దూరంగా ఉన్న ధోనీ.. నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో.. అతని కెరీర్‌పై సందిగ్ధత నెలకొనగా.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ కోసం అక్టోబరు 31 నుంచి ధోనీ తన సన్నద్ధతని మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నెల చివరి నుంచి ఝార్ఖండ్‌ సీనియర్ జట్టుతో కలిసి తొలుత ప్రాక్టీస్ చేయాలని ఆశించిన ధోనీ.. ఈ మేరకు టీమ్‌ సిబ్బందితో మాట్లాడాడు. కానీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు ఆ జట్టు సూరత్‌కి వెళ్తోందని తెలుసుకున్న ధోనీ.. ఝార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ అధికారి ఒకరు తెలిపారు.

బంగ్లాదేశ్‌తో పాటు డిసెంబరులో వెస్టిండీస్‌తో సిరీస్‌‌లో‌ కూడా ఆడకూడదని నిర్ణయించుకున్న ధోనీ.. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌‌ టైమ్‌కి మాత్రం సెలక్షన్‌కి అందుబాటులో ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఆ సిరీస్‌ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్, టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో.. ధోనీ టార్గెట్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 వరల్డ్‌కప్‌ అని స్పష్టమైంది. వచ్చే ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ వరల్డ్‌కప్ జరగనుంది.