“విధుల్లోకి ఆర్టీసీ ఉద్యోగుల రాక – ‘కేసీర్’ పిలుపుతో కార్మికులు ఒక్కోకరిగా చేరిక”

0
197

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్కరుగా విధుల్లో చేరుతున్నారు. సోమవారం (నవంబర్ 4) సాయంత్రం వరకు 30 మందికి పైగా కార్మికులు విధుల్లో చేరినట్లు సమాచారం. వీరిలో ఐదుగురు డ్రైవర్లు, ఐదుగురు కండక్టర్లు, ఏడుగురు అసిస్టెంట్ మేనేజర్లు, ఏడుగురు సూపరింటెండెంట్లు ఉన్నారు. ఓ రికార్డు ట్రేసర్, మెకానిక్ కూడా విధుల్లో చేరారు. డెడ్‌లైన్ ముగియనున్న మంగళవారం రాత్రి వరకు ఈ సంఖ్య గణనీయంగా పెరగవచ్చని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.

విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పిస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారిని ఉద్ధేశపూర్వకంగా అడ్డగించినా, ఘెరావ్‌ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి అవసరమైన భద్రత కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగుల విధులకు ఆటంకం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం చట్ట ప్రకారం నేరమని.. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని పోలీసులు పేర్కొన్నారు. విధుల్లో చేరే కార్మికులను ఎవరైనా భయపెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

సమ్మెలో ఉన్న కార్మికులు నవంబర్ 5లోగా బేషరతుగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. యూనియన్లు, ప్రతిపక్షాల రాజకీయాల్లో పడి కార్మికులు తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. కార్మికులను కూడా తమ బిడ్డలుగానే భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్మికులు మాట వినకుంటే.. ఆర్టీసీలో అన్ని రూట్లలో బస్సులకు ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ పిలుపు అందుకొని పలువురు కార్మికులు విధుల్లో చేరుతున్నారు.