ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల వద్ద కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా మందుబాబులు ఎగబడుతున్నారు. దీని ద్వారా వైరస్ వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మద్యం అమ్మకాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తమిళనాడులో మద్యం అమ్మకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా క్లిష్ట కాలంలోనూ సామాన్యుల నుంచి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వాలు చూడటం సరికాదన్నారు. ఇకపై మద్యం అమ్మకాలను ఇలానే కొనసాగితే తిరిగి మరోసారి అధికారంలోకి రారన్న విషయం మర్చిపోవద్దని అన్నాడీఎంకే ప్రభుత్వానికి రజనీ చురకలు అంటించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శించారు




























