కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మద్యం అమ్మకాలను ఆన్లైన్ పద్ధతిలో చేపట్టి.. ఇళ్లకే సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలకు సూచించింది. మద్యం అమ్మకాలపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బి.ఆర్.గవాయిలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. దేశవ్యాప్తంగా 70 వేల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయని, ఐదుకోట్ల కంటే ఎక్కువ మంది కొనుగోళ్లు చేశారని పిటిషనర్ గురుస్వామి నటరాజ్ పేర్కొన్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం అస్సలు పాటించడం లేదని, ఫలితంగా కోవిడ్–19 కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దుకాణాల్లో మద్యం నేరుగా అమ్మడాన్ని నిషేధిస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ..ఆన్లైన్లో అమ్మకాలు, హోం డెలివరీ అంశాలను పరిశీలించాలని రాష్ట్రాలకు సూచించింది.




























