శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ! సఫారిలపై ఓపెనింగ్ అదుర్స్..!

0
200

విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. టెస్టు కెరీర్‌లో తొలిసారి ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ కేవలం 154 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదిన నాలుగో భారత క్రికెటర్‌గానూ రోహిత్ నిలిచాడు. కెరీర్‌లో రోహిత్‌కి ఇది నాలుగో టెస్టు శతకంకాగా.. 54 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 178/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. మయాంక్ అగర్వాల్‌ (76 నాటౌట్: 171 బంతుల్లో 10×4, 2×6)తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ క్రీజులో కుదురుకునే వరకూ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో టీమిండియా 50 పరుగుల మైలురాయిని అందుకునేందుకు ఏకంగా 115 బంతులు తీసుకుంది. అయితే.. ఆ తర్వాత క్రమంగా రోహిత్ శర్మ గేర్ మార్చడంతో.. 98 బంతుల్లోనే 100 పరుగులు, 74 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ని భారత్ అందుకోవడం విశేషం.

దక్షిణాఫ్రికా స్పిన్నర్లని సమర్థంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. పాస్ట్ బౌలర్లని ఉతికారేశాడు. దీంతో.. ఏ దశలోనూ సఫారీ జట్టు ఈ ఓపెనర్‌పై ఒత్తిడి పెంచలేకపోయింది. స్పిన్నర్ కేశవ మహరాజ్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి మరీ భారీ షాట్లు ఆడిన రోహిత్.. ఫాస్ట్ బౌలర్ రబాడాని ఫుల్‌షాట్స్‌తో బెదరగొట్టాడు. ఇన్నాళ్లు టెస్టుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా శతకంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.