జనంలో కరోనా భయం ఎక్కువగానే ఉంది. 56 రోజుల తరువాత బస్సులు రోడ్డెక్కినా.. అవెక్కడానికి ప్రయాణికులు సాహసించలేదు. లాక్డౌన్ మినహాయింపులతో ప్రారంభమైన బస్సులు తొలిరోజు ఖాళీగానే పరుగుపెట్టాయి. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్.. బస్సులు తిరుగుతాయని సోమవారం రాత్రే చెప్పడంతో ఆ సమాచారం వేగంగానే ప్రజల్లోకి వెళ్లింది.
కానీ మంగళవారం బస్సులు బస్టాండ్లలోకి వచ్చినా.. ప్రయాణికులు రాలేదు. సాధారణంగా ఉదయం వేళ బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. కానీ ఉదయం చాలా బస్టాండ్లలో ప్రయాణికుల కోసం సిబ్బంది ఎదురుచూడాల్సి వచ్చిం ది. కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట తదితర బస్టాం డ్లలో ఉదయం 8 గంటల ప్రాంతంలో మోస్తరు సంఖ్యలో ప్రయాణికులొచ్చారు. వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్లే బస్సులెక్కగా, గ్రామాల వైపు వెళ్లే బస్సులు చాలాసేపు బస్టాండ్లలోనే ఉండిపోయాయి.
6,153 బస్సులు తిప్పేందుకు సిద్ధం చేసుకోగా.. మంగళవారం సాయంత్రం కర్ఫ్యూ సమయానికి 3,179 బస్సులు మాత్రమే తిరిగాయి. కరీంనగర్ జోన్ పరిధిలో 1,585, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 510 సర్వీసులు నడిచాయి. నడపాల్సిన బస్సు ల్లో 51% వరకే తిరిగాయి. మం గళవారం సగటు ఆక్యుపెన్సీ 35%గా నమోదైంది. బస్సుల్లో నిలబడి ప్రయాణించటాన్ని నిషేధిస్తున్నట్టు సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. భౌతికదూరం పాటించేలా కొన్ని సీట్లను కూర్చోకుండా చేయాలన్న ఆలోచననూ విరమించుకుంది.























