విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపై పడిపోయారు. ఇటీవల కాలం వరకు లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. అయితే గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు.























