వర్షంతో ముగిసిన మొదటి రోజు – ఆఖరి సెషన్ లో అంతరాయం?

0
177

భారత్, దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నం వేదికగా బుధవారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌‌లో మొదటి రోజు వర్షం కారణంగా రెండు సెషన్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ (115 బ్యాటింగ్: 174 బంతుల్లో 12×4, 5×6) అజేయ శతకం బాదడంతో రెండో సెషన్‌లో 59.1 ఓవర్లు ముగిసే సమయానికి 202/0తో నిలిచింది. ఈ దశలో భారీ వర్షం రావడంతో మ్యాచ్‌ని అంపైర్లు నిలిపివేశారు. క్రీజులో రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (84 బ్యాటింగ్: 183 బంతుల్లో 11×4, 2×6) ఉన్నాడు.

భారీ అంచనాలు, ఒత్తిడి నడుమ కెరీర్‌లో తొలిసారి టెస్టు ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ.. అజేయ శతకంతో చెలరేగిపోయాడు. క్రీజులో కుదురుకునేందుకు ఆరంభంలో కొంత టైమ్ తీసుకున్న రోహిత్ శర్మ.. ఆ తర్వాత క్రీజు వెలుపలికి వచ్చి మరీ భారీ సిక్సర్లు బాదాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో చక్కగా బ్యాట్‌ఫుట్‌పైకి వచ్చి పాయింట్ దిశగా బౌండరీలు బాదిన ఈ ఓపెనర్.. ఫాస్ట్ బౌలర్లకి ఫుల్ షాట్స్‌తో సమాధానమిచ్చాడు. ఈరోజు ఆట ముగిసే వరకూ రోహిత్ శర్మని నిలువరించేందుకు వరుసగా బౌలర్లని మార్చినా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ ఫలితం రాబట్టలేకపోయాడు.

వెస్టిండీస్‌పై ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో హాఫ్ సెంచరీ బాదిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. ఈరోజు మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మకి చక్కటి సహకారం అందిస్తూనే అర్ధశతకం సాధించాడు. ఒక ఎండ్‌లో రోహిత్ దూకుడు చూసిన మయాంక్ కూడా.. రెండు సిక్సర్లు బాదడం విశేషం. ఈ ఓపెనర్ల జోరుతో సఫారీ బౌలర్లు మరింత ఒత్తిడిలో పడిపోయారు. దీంతో.. లయ తప్పిన వారి బౌలింగ్‌ని ఉతికారేసిన రోహిత్- మయాంక్ జోడీ.. తొలి రోజు మొదటి వికెట్‌కి అజేయంగా 202 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత్ జట్టుకి టెస్టుల్లో తొలి వికెట్‌కి శతక భాగస్వామ్యం లభించడం గత 25 ఇన్నింగ్స్‌ల్లో ఇదే తొలిసారి కావడం కొసమెరుపు.