కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ గడువు పొడిగించాలా, వద్దా అనే దానిపై నిర్ణయాన్ని ప్రజలకే వదిలిపెట్టాలని ఆయన భావించారు. మే 17 తర్వాత లాక్డౌన్ కొనసాగించాలా, అవసరం లేదా అనే దానిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1031 నంబర్, వాట్సప్ నంబరు 8800007722 లేదా delhicm.suggestions@gmail.com సలహాలు, సూచనలు పంపాలని ప్రజలను కోరారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చని ప్రకటించారు. కాగా, లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.




























