మాటల యుద్దం మొదలైంది! పుజారా పై నోరుజారిన రాబాడ

0
160

పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ క్రమశిక్షణ తప్పాడు. మ్యాచ్‌లో తొలిరోజైన గురువారం రెండో సెషన్‌లో చతేశ్వర్ పుజారా‌పై మైదానంలోనే రబాడ స్లెడ్జింగ్‌కి దిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మయాంక్ అగర్వాల్ (108: 195 బంతుల్లో 16×4, 2×6)తో కలిసి రెండో వికెట్‌కి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన చతేశ్వర్ పుజారా (58: 112 బంతుల్లో 9×4, 2×6) భారత్‌ని మెరుగైన స్థితిలో నిలిపాడు.

రోహిత్ శర్మ (14) తొలి సెషన్ ఆరంభంలోనే ఔటవడంతో క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా.. క్రీజులో కుదురుకునే వరకూ ఎక్కువగా డిఫెన్స్ చేస్తూ కనిపించాడు. దీంతో.. సహనం కోల్పోయిన కగిసో రబాడ.. కవ్వింపులకి దిగుతూ పుజారా ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సఫారీ పేసర్ నోరు జారినప్పటికీ.. ఆ స్లెడ్జింగ్‌‌ని పట్టించుకోని పుజారా.. హాఫ్ సెంచరీ‌తో సత్తాచాటాడు. కానీ.. జట్టు స్కోరు 163 వద్ద.. రబాడ బౌలింగ్‌లోనే పుజారా వికెట్ సమర్పించుకోగా.. అతను పెవిలియన్‌కి వెళ్తున్న సమయంలోనూ రబాడ అసభ్య పదాలతో మరోసారి నోరుజారాడు.

రబాడ స్లెడ్జింగ్‌ గురించి పుజారా మాట్లాడుతూ ‘రబాడ ఏమన్నాడో నాకు సరిగా గుర్తులేదు. కానీ.. బ్యాట్స్‌మెన్‌లపై తరచూ కవ్వింపులకి దిగే బౌలర్లలో అతనూ ఒకడు. ఒక బౌలర్‌గా అతను నా ఏకాగ్రతని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాడని నాకు తెలుసు. అందుకే.. మైదానంలో అతడి మాటల్ని నేను పట్టించుకోలేదు’ అని వెల్లడించాడు. వాస్తవానికి రబాడ వాడిన పదాల్ని పుజారా విని కాస్త నొచ్చుకున్నట్లు కనిపించింది. కానీ.. వాటిని బహిర్గతం చేయకుండా పుజారా హుందాగా వ్యవహరించాడు. ఇటీవల రోహిత్ శర్మ కూడా సింగిల్ తీసేందుకు నిరాకరించిన పుజారాని మైదానంలోనే తిట్టిన విషయం తెలిసిందే. దీంతో.. వరుసగా రెండో టెస్టులోనూ పుజారా బాధితుడిగా మిగిలాడు.

2015లో భారత్ సిరీస్‌తో వెలుగులోకి వచ్చిన కగిసో రబాడ.. ఈ నాలుగేళ్ల వ్యవధిలో ప్రతిభ కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌తో గొడవపడి వార్నింగ్, జరిమానాల్ని ఈ సఫారీ బౌలర్ ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ.. అతని తీరు మారడం లేదు.