బంగ్లాదేశ్ చేతిలో ఊహించని ఓటమితో టీమిండియా మేనేజ్మెంట్ కారణాలు వెతికే పనిలో పడింది. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోకపోవడంతో బలహీనంగా కనిపించిన బంగ్లాదేశ్ చేతిలో అవమానకరంగా 7 వికెట్ల తేడాతో ఓడిపోవడాన్ని టీమిండియా జీర్ణించుకోలేకపోతోంది. టీ20 చరిత్రలో వరుసగా 8 సార్లు బంగ్లాదేశ్ని అలవోకగా ఓడించేసిన భారత్ జట్టు.. ఆ జట్టు చేతిలో ఓడిపోవడం ఇదే తొలిసారి. కీలక సమయంలో పేలవ బౌలింగ్తో భారత్కి మ్యాచ్ని దూరం చేసిన ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్పై రెండో టీ20లో వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ విజయానికి చివరి 12 బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ చేతికి కెప్టెన్ రోహిత్ శర్మ బంతినిచ్చాడు. తొలి రెండు బంతుల్ని చక్కగా విసిరి రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన ఖలీల్.. ఆ తర్వాత లయ తప్పాడు. అప్పటికే క్రీజులో సెటిలైన ముష్ఫికర్ రహీమ్ ( 60 నాటౌట్: 43 బంతుల్లో 8×4, 1×6)కి షార్ట్ పిచ్ బంతి విసరగా దాన్ని డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా అతను బౌండరీ బాదేశాడు. ఆ తర్వాత బంతిని లెగ్స్టంప్ లైన్పై విసరగా.. స్కూప్తో ఫోర్గా మలిచిన ముష్ఫికర్.. తర్వాత బంతి లడ్డులా ఆఫ్ స్టంప్కి వెలుపలగా ఫుల్ టాస్ రూపంలో రావడంతో దాన్ని బౌండరీకి తరలించాడు. ఇక ఆఖరి బంతికీ ఖలీల్ ఫోర్ సమర్పించుకున్నాడు. మొత్తంగా.. ఆ ఓవర్లో 18 పరుగులు రాబట్టిన బంగ్లాదేశ్ ఆఖరి ఓవర్కి సమీకరణాన్ని 6 బంతుల్లో 4 పరుగులుగా మార్చేసింది.
ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ కావడంతో ఖలీల్ అహ్మద్కి సెలక్టర్లు వరుస అవకాశాలిస్తున్నారు. కానీ.. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేకపోయిన ఖలీల్.. ఒక్క ఓవర్లో మ్యాచ్తో పాటు అంచనాల్ని తలకిందులు చేసేశాడు. దీంతో.. రెండో టీ20లో అతనిపై వేటు వేసి శార్ధూల్ ఠాకూర్కి అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.























