వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది. తాజాగా రూ. 50 కోట్ల చేరిపోయింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. వరుసగా నాలుగో రోజుకూడా బాక్సాఫీస్ వద్ద 8 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరిందని ప్రముఖ బాలీవుడ్ సినీ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.
అదే విధంగా ‘బాలా’ మూవీ సౌదీ అరేబియాలో సెన్సార్ పూర్తి చేసుకుందని.. నవంబర్ 14న ఈ చిత్రం సౌదీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కాగా సౌదీలో రిలీజ్ ఆయ్యే అయూష్మాన్ ఖురానా మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా, భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది.



























