వచ్చే మరికొద్ది రోజుల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం సగటున 3 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వస్తుండటం, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తుండటంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు సరిపోని పరి స్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే కోచ్లను వాడకానికి వీలుగా సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ డీజీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా వినియోగించాల్సిన రైళ్లతో కూడిన తొలి విడత జాబితాను సిద్ధం చేసింది.




























