కేజిఫ్ టీంకు కోర్టు నోటిసులు! అయోమయంలో టీం సభ్యులు..?

0
196

కన్నడ నటుడు యష్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం కేజీఎఫ్‌. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. దీంతో కేజీఎఫ్‌ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు చిత్రయూనిట్‌.

అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించారోగాని మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఈ సినిమాను మొదట సైనైడ్‌ హిల్స్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. కానీ అక్కడి ప్రజలు సినిమా షూటింగ్ కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని షూటింగ్‌ను అడ్డుకోవటంతో ఆ షెడ్యూల్‌ను వాయిదా వేశారు.

తరువాత కోర్టును ఆశ్రయించి మరీ సైనైడ్‌ హిల్స్‌లో షూటింగ్‌కు అనుమతి సాధించారు. తాజాగా ఈ సినిమాకు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాలోని ఓ పాత్ర ఓ నిజజీవిత పాత్రను పోలి ఉండటంతో అతని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కన్నడ ఫిలిం చాంబర్‌తో పాటు కేజీఎఫ్‌ టీంకు నోటీసులు జారీ చేసింది.

1980లలో కరుడుగట్టిన నేరస్తుడిగా పేరున్న తంగం అనే వ్యక్తిని పోలిన పాత్ర కేజీఎఫ్‌లో ఉందంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేజీఎఫ్‌ తొలి భాగం సమయంలోనూ తంగ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ అప్పట్లో విషయం కోర్టు వరకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు రావటంతో చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో అని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యష్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. రవీనాటండన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలి భాగం సంచలన విజయం సాధించటంతో రెండో భాగాన్ని మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.