లాక్డౌన్ వేళ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అన్నం పెడుతోంది. ఆపద సమయంలో దేశానికి ఆహార భద్రత కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ఆహార కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని ప్రత్యేక గూడ్స్ రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలించి ప్రజల ఆకలి తీర్చడంలో మన రాష్ట్రం కీలక భూమిక పోషించింది. రాష్ట్రంలో ఎఫ్సీఐ ద్వారా సేకరించిన బియ్యాన్ని కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 116 గూడ్స్ రైళ్ల ద్వారా పంపించినట్లు ఎఫ్సీఐ సీఎండీ డీవీ ప్రసాద్ చెప్పారు. అండమాన్, నికోబార్ దీవులకు కూడా కొంతమేర బియ్యం పంపించామన్నారు.























