“విరాట్ కి విశ్రాంతి – సంజు శామ్సన్, శివం దూబేలకు చోటు”!

0
183

కోహ్లి మరోసారి పొట్టి ఫార్మాట్‌నుంచి విశ్రాంతి కోరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అతను దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో గురువారం సమావేశమైన కమిటీ టి20, టెస్టు జట్లను ప్రకటించింది. టి20 జట్టులో ఇద్దరికి కొత్తగా అవకాశం దక్కింది. ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే తొలి సారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శామ్సన్‌ను కూడా మళ్లీ టీమ్‌లోకి ఎంపిక చేశారు.రిషభ్‌ పంత్‌ కూడా జట్టులో ఉన్నా… శామ్సన్‌ను రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా టీమ్‌లోకి తీసుకోవడం విశేషం. చహల్‌ కూడా కొంత విరామం తర్వాత పునరాగమనం చేశాడు. బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ ఇంకా గాయాలనుంచి కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీలించలేదు. ఇటీవలి కాలంలో భారత్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తూ వచి్చన రవీంద్ర జడేజాకు కూడా టీమ్‌లో చోటు దక్కలేదు. అతని లాంటి శైలి ఆటగాడే అయిన కృనాల్‌ పాండ్యా ఇప్పటికే జట్టులో ఉండటం ఇందుకు కారణం. నవదీప్‌ సైనీ ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా శార్దుల్‌ను ఎంపిక చేశారు.

టి20 జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాహుల్, అయ్యర్, మనీశ్‌ పాండే, సంజు శామ్సన్, రిషభ్‌ పంత్, దూబే, కృనాల్, వాషింగ్టన్‌ సుందర్, చహల్, దీపక్‌ చహర్, రాహుల్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్, శార్దుల్‌ ఠాకూర్‌.

టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్‌), మయాంక్, రోహిత్, పుజారా, రహానే, విహారి, సాహా, పంత్, జడేజా,అశ్విన్, షమీ, ఇషాంత్, ఉమేశ్, కుల్దీప్, శుబ్‌మన్‌ గిల్‌.