మూడవ రోజు మొదటి వికెట్ – ‘ఇండియాకి బ్రేకిచ్చిన ఇషాంత్ శర్మ’

0
191

దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌ని 502/7తో డిక్లేర్ చేసి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. ఆటలో మూడో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 39/3తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా టీమ్ తొలి సెషన్ ఆరంభంలోనే 63 పరుగుల వద్ద బవుమా రూపంలో నాలుగో వికెట్ చేజార్చుకుంది.

ఇన్నింగ్స్ 27వ ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఫ్రంట్‌ ఫుట్‌పైకి వచ్చి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన తెంబ బవుమా (18: 26 బంతుల్లో 3×4) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆఫ్ స్టంప్‌ లైన్‌ పడిన బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ని తాకింది. దీంతో.. ఎల్బీడబ్ల్యూ కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు. అయితే.. ఈ నిర్ణయంపై డీఆర్‌ఎస్ కోరేలా కనిపించిన బవుమా.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లోని ఎల్గర్‌ని సంప్రదించాడు.

కానీ.. బంతి వికెట్లను తాకేలా ఉందని ఎల్గర్ చెప్పడంతో.. నిరాశగా బవుమా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90/4తో కొనసాగుతుండగా.. ఆ జట్టు భారత్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 412 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో ఓపెనర్ డీన్ ఎల్గర్ (44 బ్యాటింగ్: 104 బంతుల్లో 5×4, 1×6), డుప్లెసిస్ (19 బ్యాటింగ్: 25 బంతుల్లో 3×4, 1×6) ఉన్నారు.