కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీ రథచక్రాలు డిపోలోనే లాక్డౌన్ అయ్యాయి. 50 రోజులుగా బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం, జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో లాక్డౌన్ వేళల్లో సడలింపును ఇచ్చిన విషయం తెలిసిందే. దుకాణ సముదాయాలు తెరుచుకున్నాయి. మున్సిపల్ పరిధిలో 50 శాతం దుకాణాలు సరి, బేసి విధానంలో కొనసాగేలా చర్యలు చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేలా చూస్తున్నారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం సేవలు ప్రారంభమయ్యాయి. ఇక రవాణా వ్యవస్థనే ప్రారంభం కావాల్సింది. అయితే ఆర్టీసీ సిబ్బంది బస్సులకు చిన్నపాటి మరమ్మతు చేసి వాటిని సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే రోడ్డెక్కిచ్చేలా చర్యలు చేపడుతున్నారు. డ్రైవర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు.























