“ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్”

0
213

దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో 529 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌ల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మూడు టెస్టుల సిరీస్‌లో ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు పైకి ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటికే వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం, టీ20ల్లో 8వ ర్యాంక్‌లో ఉన్న రోహిత్ శర్మ.. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ టాప్-10లో నిలిచాడు. ఇప్పటి వరకూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇలా మూడు ఫార్మాట్లలోనూ టాప్-10లో నిలిచిన భారత క్రికెటర్ల జాబితాలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మాత్రమే ఉండగా.. తాజాగా రోహిత్ శర్మ మూడో భారత క్రికెటర్‌గా వారి సరసన చేరాడు.

దక్షిణాఫ్రికాపై పుణె టెస్టులో డబుల్ సెంచరీ బాది నెం.1 ర్యాంక్‌కి అత్యంత చేరువైన విరాట్ కోహ్లీ.. రాంచీ టెస్టులో విఫలమవడం ద్వారా.. మళ్లీ 12 పాయింట్ల దూరంలో ఉండిపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ 937 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 926 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక చతేశ్వర్ పుజారా (795), అజింక్య రహానె (751) వరుసగా 4, 5 స్థానాల్లో ఉండగా.. రోహిత్ శర్మ (722) 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10 రికార్డ్స్ పరంగా చూసుకుంటే.. విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో నెం.1, టెస్టుల్లో నెం.2, టీ20ల్లో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ గంభీర్.. గతంలో టెస్టులు, టీ20ల్లో నెం.1 స్థానంలో నిలిచి.. వన్డేల్లో మాత్రం 8వ స్థానంతో సరిపెట్టాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య నవంబరు 3 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది.