ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీలకు ఆన్లైన్ ద్వారా గుర్తింపు ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టింది. కోర్సుల మార్పులు లేని కాలేజీలకు ఇప్పటికే అనుమతులిచ్చిన ఏఐసీటీఈ కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు కూడా తాజాగా అనుమతుల ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా యాజమాన్యాల నుంచి వసతులు, ఫ్యాకల్టీ వివరాలతో కూడిన పత్రాలను ఆన్లైన్ ద్వారా పరిశీలించిన ఏఐసీటీఈ కాలేజీ యాజమాన్యాలతో ఆన్లైన్ సమావేశాలను నిర్వహణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన కాలేజీలకు ఒక్కోరోజు సమయం ఇచ్చి వారు దరఖాస్తు చేసుకున్న కొత్త కోర్సుల నిర్వహణకు పాటించాల్సిన నిబంధనలను తెలియజేస్తోంది. తాము ఆన్లైన్లో అనుబంధ గుర్తిం పు ఇచ్చినా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా కోర్సుల నిర్వహణ ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాలేజీలతోనూ ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయం అధికారులు ఆన్లైన్ ద్వారా సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు.























