“పంత్”పై విమర్శలు – “రోహిత్” ఆగ్రహం!!!

0
207

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై అతిగా చర్చ జరుగుతుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ రిషబ్ పంత్ ఫెయిలయ్యాడు. ఢిల్లీలో జరిగిన తొలి టీ20లో వికెట్ కీపర్‌గా డీఆర్‌ఎస్ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మకి ఎలాంటి సహాయం అందించలేకపోయిన రిషబ్ పంత్.. రెండో టీ20లో బేసిక్ తప్పిదం కారణంగా భారత్‌కి వికెట్ చేజార్చాడు. బంతికి వికెట్లని దాటక మునుపే అందుకుని లిట్టన్ దాస్‌ని పంత్ స్టంపౌట్ చేయడంతో ఆ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. వికెట్ కీపింగ్ బేసిక్స్ కూడా నీకు తెలియవా..? అంటూ రిషబ్ పంత్‌పై అందరూ విమర్శలు గుప్పించారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టీ20లు ముగియగా.. సిరీస్‌ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. అక్కడ కూడా రిషబ్ పంత్‌ గురించి చర్చ రావడంతో సీరియస్ అయ్యాడు. రెండో టీ20కి ముందు రోహిత్ మీడియాతో మాట్లాడుతుండగా.. జర్నలిస్ట్ ఫోన్ రింగ్ అవడంతో ‘సెలైంట్‌లో పెట్టండి బాస్’ అని అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘రిషబ్ పంత్ గురించి ప్రతి రోజు, ప్రతి నిమిషం చర్చ జరుగుతోందని మీకు తెలుసు. కానీ.. మీకు నేను చెప్పేది ఒక్కటే.. అందరూ అతడి నుంచి కాస్త చూపు పక్కకి తిప్పుకోండి. వాస్తవానికి రిషబ్ పంత్ బెరుకులేని క్రికెటర్. టీమిండియా అతడి నుంచి సహజసిద్ధమైన ఆటని ఆశిస్తోంది. అయితే.. అతను స్వేచ్ఛగా ఆడాలంటే మాత్రం.. ఫస్ట్ అందరూ అతని గురించి చర్చించడం కొద్దిరోజులు మానేయాలి. మైదానంలో జట్టు కోసం రిషబ్ పంత్ ఏం చేయాలని ఆశిస్తున్నాడో..? అది చేయనివ్వడమే ప్రస్తుతం ఉత్తమం’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.