మూడు టెస్టుల సిరీస్లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య బుధవారం తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. విశాఖ నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. అయితే విశాఖ స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరాభిమాని సందడి చేశాడు. ఒడిశాకు చెందిన అభిమాని పింటు బెహ్రా తన ఒంటిపై పూర్తిగా విరాట్ కోహ్లీ టాటూలు వేయించుకుని అందరిని ఆకర్షించాడు.
టాటూలను చూసి ఆశ్చర్యపోయిన కోహ్లీ:
విశాఖ స్టేడియంలో విరాట్ కోహ్లీ మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. మీడియాతో మాట్లాడిన అనంతరం కోహ్లీ తిరిగి వెళుతున్న సమయంలో పింటు బెహ్రా ఎదురయ్యాడు. బెహ్రా ఒంటిపై టాటూలను చూసిన కోహ్లీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆపై తేరుకున్న కోహ్లీ అతడిని ఆలింగనం చేసుకుని మాట్లాడాడు. దీంతో పింటు బెహ్రా అందంలో మునిగిపోయాడు. బెహ్రా వీపుపై కోహ్లీ వాడే జెర్సీ నెంబర్ 18తో పాటు పేరు, ఛాతీపై చిత్రపటం టాటూలుగా ఉన్నాయి. అంతేకాదు 2008 అండర్-19 ప్రపంచకప్, 2013 అర్జున అవార్డు, 2017 పద్మశ్రీ అవార్డు అని కూడా టాటూ వేయించుకున్నాడు.
కోహ్లీ నా దేవుడు:
‘ప్రజలు టాటూలను ఫ్యాషన్గా లేదా దేవునిపై ఉన్న ప్రేమ, గౌరవం చూపించడానికి వేసుకుంటారు. విరాట్ కోహ్లీ నా దేవుడు. అతని పట్ల నాకున్న ప్రేమ, గౌరవాన్ని ఈ విధంగా చూపించా. కోహ్లీ క్రికెట్ను ఎలా ఆడుతున్నాడో చూపించే మార్గం ఇది. కోహ్లీ ఇప్పటివరకు సాధించిన వాటిని నేను ఇష్టపడతాను. చివరకు కోహ్లీని కలుసుకొవడం సంతోషంగా ఉంది’ అని బెహ్రా చెప్పాడు.
శాశ్వత టాటూలు:
భారత క్రికెట్ అభిమానులు తమ ఇష్టమైన ఆటగాడిని గుండెలపై పెట్టుకుంటారు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిమాని సుధీర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమాని రాంబాబు టీమిండియా ఆడే ప్రతి ఆటలకు హాజరుకావడం చూసాం. ఈ ఇద్దరు తమపై పెయింట్ వేసుకుని స్టేడియాలలో సందడి చేస్తారు. కానీ.. బెహ్రా ఒక అడుగు ముందుకు వేసి కోహ్లీపై తన ప్రేమను తెలపడానికి శాశ్వత టాటూలు వేసుకోవడం విశేషం.




























