కరోనావైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి ప్రపంచ బ్యాంకు భారీ ఊరట నిచ్చింది. దేశంలోని పట్టణ పేదలు , వలస కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ నిధిగా 1 బిలియన్ డాలర్లు సహాయాన్ని అందించనుంది. ఆరోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద ప్రాజెక్టు అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో భారతదేశం అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. కోవిడ్-19, లాక్డౌన్ వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.
సోషల్ సెక్యూరిటీ టెక్నాలజీ ప్యాకేజీ కింద భారత్లోని 400కు పైగా సామాజిక భద్రతాపథకాల అమలుకు ఈ వంద కోట్ల డాలర్లు ఉపయోగపడనున్నాయని బ్యాంకు పేర్కొంది. “గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణ పేదల పట్ల సామాజిక భద్రతను తిరిగి సమతుల్యం చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమని ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ చాలా ముఖ్యమైనదని ప్రశంసించారు. కోవిడ్ -19 తరువాత దేశంలో జీవితం, జీవనోపాధి పరిస్థితుల్లో పెద్ద తేడా ఉండబోదని భావిస్తున్నాన్నారు. నగదు బదిలీ విధానం చాలా కీలకమైందని, దాని వల్ల జీవణ ప్రమాణాలు చాలా వేగంగా, సులువుగా అభివృద్ధి చెందుతాయని వరల్డ్ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరక్టర్ మైఖేల్ రుట్కోస్కీ తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో పేదలకు నగదు లభ్యత, ఆహార ప్రయోజనాలతో భదత్రను కల్పించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వరల్డ్ బ్యాంకు తెలిపింది. ప్రభుత్వ సహకారంతో ప్లాట్ఫామ్లను ఏకీకృతం చేయడమే ప్రపంచ బ్యాంకు లక్ష్యం, తద్వారా ప్రజలు అనేక సామాజిక పథకాలను పొందటానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లవలసిన అవసరం ఉండదని ప్రపంచ బ్యాంకు సీనియర్ అధికారి భట్టాచార్య అన్నారు.























