జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్పై విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రోజు నుంచి ఏపీ సీఎంపై ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు. ఇసుక కొరత, జగన్ పాలనతో పాటూ మరికొన్ని అంశాలపై.. వరుసగా మూడు రోజుల నుంచి వరుస ట్వీట్లతో జగన్ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఇసుక కొరతపై మళ్లీ స్పందించిన పవన్.. మీడియాతో పాటూ అన్ని విపక్ష పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం ఇసుక పాలసీ విషయంలో జరిగిన తప్పుల్ని గుర్తించారని చెప్పుకొచ్చారు. జనసేనాని తన ట్వీట్లో ‘50మంది భవన నిర్మాణ కార్మికుల చావుకు కారణమైన.. 35 లక్షలమందికి ఉపాధి లేకుండా చేసిన..ఇసుక పాలసీలోని తప్పుల్ని.. సీఎం జగన్ రెడ్డి గుర్తించేలా, తెలుసుకునేలా చేసినందుకు కారణమైన మీడియా, మిగిలిన రాజకీయ నేతలు, ఇతరులకు.. జనసేన తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం’అన్నారు పవన్ కళ్యాణ్.
I urge all Janasainiks to keep a watch on illicit sand mining as the fight on sand corruption has just started.
— Pawan Kalyan (@PawanKalyan) November 18, 2019
పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల పోరాటంతో జగన్ ఇసుక పాలసీలో జరిగిన తప్పుల్ని తెలుసుకున్నారని పవన్ పరోక్షంగా చెప్పారు. అంతేకాదు మరో ట్వీట్లో జనసైనికుల్ని అప్రమత్తం చేస్తూ కీలక సూచన చేశారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలపై ఓ కన్నేసి ఉంచాలని.. అలాగే ఇసుకలో జరిగే అవినీతిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది’అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రభుత్వం ఇసుక కొరత, అక్రమ రవాణాను సీరియస్గా తీసుకుంది. ఎవరైనా అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 14500ను ఏర్పాటు చేసింది.ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు ఇసుక అమ్మితే రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.























