బంగ్లాకు భారీ దెబ్బ – ఇండియా టూర్ కు కెప్టెన్ “షకీబ్ అల్ హసన్” దూరం..?

0
191

భారత్‌ గడ్డపై సిరీస్ ఆరంభానికి ముందే బంగ్లాదేశ్‌కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమవగా.. సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వ్యక్తిగత కారణాలతో టూర్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా భారత్‌తో సిరీస్‌కి దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి.

నవంబరు 3 నుంచి మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌ని టీమిండియాతో బంగ్లాదేశ్‌ ఆడనుండగా.. ప్రస్తుతం బంగ్లాలో ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. కానీ.. ఈ సెషన్‌కి కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఒకే ఒక సెషన్‌కి హాజరైన షకీబ్.. చురుగ్గా ప్రాక్టీస్ కూడా చేయలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల జీతాల పెంపు విషయమై ఇటీవల షకీబ్ అల్ హసన్ నాయకత్వంలోనే క్రికెటర్లు స్రైక్ చేయగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వారి డిమాండ్లని పరిష్కరించేందుకు అంగీకరించింది. దీంతో.. ఆటగాళ్లు సమ్మెని విరమించారు. అయితే.. ఈ స్ట్రైక్ జరుగుతున్న సమయంలోనే లోకల్ టెలికాం సంస్థతో షకీబ్ ఓ ఒప్పందం చేసుకున్నాడు. బోర్డు నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థతో క్రికెటర్‌ ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదు. దీంతో.. అతనికి బంగ్లా క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసులు పంపింది. అయితే.. ఇప్పటి వరకూ షకీబ్ ఆ నోటీసులపై స్పందించలేదు.