మూడు నెలలుగా కరోనా వ్యాధి నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వైపు మళ్లనుంది. వైరస్ కట్టడికి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే, ప్రగతి కార్యక్రమాలను పరుగులు పెట్టించనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు.
కరోనా వైరస్ నియంత్రణతోపాటు ప్రభుత్వం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల అమలుపై ఆయన కలెక్టర్లకు సూచనలు చేసే దిశగా సమావేశపు ఎజెండాను ఖరారు చేశారు. ఈ సమావేశంలో నియంత్రిత వ్యవసాయంతో పాటు భూముల ప్రక్షాళన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, భూసేకరణ, రుణమాఫీ, ఉపాధి హామీ పనులు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర పది అంశాలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు.























