“ఆ ఇద్దరి సపోర్ట్ – ఈ ఇద్దరికేనంట”

0
217

టైటిల్‌ గెలవడానికి ఇంటి సభ్యులు చేయాల్సిందంతా చేసేశారు. ఇప్పుడు అంతిమ తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. అయితే వారి తీర్పును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హౌస్‌మేట్స్‌తో పాటు ఆయా ఇంటి సభ్యుల అభిమానులు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. వీరికి సపోర్ట్‌ చేస్తూ కొంతమంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు. శ్రీముఖికి బుల్లితెర యాంకర్‌ రష్మీ మద్దతు తెలుపగా.. రాహుల్‌కు పాప్‌ సింగర్‌ నోయెల్‌ ప్రచారం చేస్తున్నాడు. అలీ రెజాకు పటాస్‌ పంచ్‌ల యాంకర్‌ రవి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో సింగర్‌ గీతా మాధురి, నటి హరితేజ బిగ్‌బాస్‌ 3పై స్పందించారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్‌ ద బెస్ట్‌ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌లతో దిగిన ఫొటోను మాత్రమే పంచుకుంది. అంటే గీతామాధురికి వాళ్లిద్దరిలో ఎవరు టైటిల్‌ గెలిచినా ఓకే అని స్పష్టమవుతోంది.

అయితే.. ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలనేదానిపై అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గీతా మాధురి ఫ్యాన్స్‌ రెండు టీంలుగా విడిపోయి రాహుల్‌, శ్రీముఖికి మద్దతు తెలుపుతూ ఓట్లు చీల్చుతున్నారు. ఇక వాళ్లిద్దరిలోనే ఎవరో ఒకరు గెలవాలని కోరుకుంటున్నప్పుడు అందరికీ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పడం ఎందుకని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన గీతా మాధురి బిగ్‌బాస్‌ ఐ లోగోను పచ్చబొట్టు వేయించుకుంది. ఈ సీజన్‌లో శ్రీముఖి ‘బిగ్‌బాస్‌ కన్ను’ను పచ్చబొట్టు వేయించుకోవటంతో ఆమె కూడా రన్నరప్‌గా నిలుస్తుందని కొంతమంది నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. మరి శ్రీముఖి టైటిల్‌ సాధిస్తుందా? తడబడుతుందా అనేది చూడాలి. మరోవైపు మొదటి సీజన్‌లో టాప్‌ 3లో చోటు దక్కించుకున్న హరితేజ.. తన ఫేవరెట్‌ కంటెస్టెంట్లు శ్రీముఖి, రాహుల్‌ అని చెప్తూ.. ఆ ఇద్దరికీ టైటిల్‌ గెలిచేందుకు ఆల్‌ ద బెస్ట్‌ తెలియజేసింది.